బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యల ఫలితం... చత్తీస్ గఢ్ సీఎం తండ్రి అరెస్ట్

  • ఛత్తీస్ గఢ్ లో కీలక పరిణామం
  • సీఎం భూపేష్ బఘేల్ తండ్రి నందకుమార్ అరెస్ట్
  • 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ
  • జైలుకు తరలింపు
ఛత్తీస్ గఢ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రాహ్మణ సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేసిన సీఎం భూపేష్ బఘేల్ తండ్రి నందకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను రాయ్ పూర్ కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దాంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు.

నందకుమార్ బఘేల్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులను విదేశీయులని అన్నారు. "బ్రాహ్మణులను గంగా నది నుంచి వోల్గా నదికి పంపించి వేయాలి. వారు మన దేశానికి చెందినవారు కాదు. వారు మనల్ని అంటరానివారుగా చూస్తుంటారు. మన హక్కులన్నీ లాగేసుకున్నారు. అందుకే బ్రాహ్మణులను ఎవరూ గ్రామాల్లోకి రానివ్వరాదు. వారిని బహిష్కరించాలి" అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

దీనిపై బ్రాహ్మణ సంఘాలు మండిపడ్డాయి. సర్వ బ్రాహ్మణ సమాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందకుమార్ బఘేల్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఈ కేసు నమోదైన క్రమంలో సీఎం భూపేష్ బఘేల్ వ్యాఖ్యానిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తండ్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Nand Kumar Baghel
Bhupesh Baghel
Chhattisgarh
Remarks

More Telugu News